AP Corona Update: ఏపీలో కోవిడ్ పడకలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. బాధితుల సంఖ్య తగ్గడం, వ్యాధి నయమై ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యి వెళ్లేవారు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
శనివారానికి 58 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బాధితులు అసలు లేరు. మరో 80 ఆసుపత్రుల్లో చికిత్స పొందే బాధితుల సంఖ్య ఐదులోపే ఉంది. 25 కోవిడ్ సంరక్షణ కేంద్రాల్లో బాధితులు అసలు లేరు. గత రెండు రోజులుగా సగటున పదివేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో శుక్రవారం 1,664 ఐసీయూ, 8,186 ఆక్సిజన్ పడకలు ఖాళీగా ఉన్నాయి. గత 24 గంటల్లో ఈ ఖాళీలు పెరిగాయి. కొద్దిరోజుల కిందట 95% వరకు పడకలు భర్తీ అయ్యాయి.
శనివారం మధ్యాహ్నానికి 1,174 ఐసీయూ, 8,164 ఆక్సిజన్ పడకలు చొప్పున ఖాళీగా ఉన్నాయి. శనివారం 406 టన్నుల ఆక్సిజన్ వినియోగించారు. కేంద్రం రాష్ట్రానికి రోజూ 590 టన్నుల ఆక్సిజన్ పొందే సౌకర్యాన్ని కల్పించింది. కోవిడ్ చికిత్సను అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రాష్ట్రంలో 550 వరకు ఉన్నాయి.
వీటిలో గుంటూరు జిల్లాలో 14, కృష్ణాలో 4, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 6 చొప్పున, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో 4 చొప్పున ఆసుపత్రుల్లో బాధితులు లేరు. ఐదుగురిలోపు బాధితులున్న ప్రైవేటు ఆసుపత్రులు 88 ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 135 కోవిడ్ సంరక్షణ కేంద్రాలున్నాయి. వీటిలో శనివారానికి 12,247 మంది చికిత్స పొందుతున్నారు. 25 చోట్ల బాధితులు లేరు. 15 కేంద్రాల్లో 10 మంది లోపు ఉన్నారు. 30 కేంద్రాల్లో 50 మంది లోపు ఉన్నారు. 500-1000 మధ్యన బాధితులున్న కేంద్రాలు 5 వరకు ఉన్నాయి. శనివారం మొత్తమ్మీద 3,247 మంది డిశ్ఛార్జి కాగా 1,248 మంది ఆసుపత్రుల్లో చేరారు.