Major Changes That Will Set In From November 1: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే మనం వెంటనే అప్రమత్తమైపోతాం. ఇంటి అద్దె బిల్లులు , చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున పూర్తి చేస్తాం.
అంతేందుకు ప్రభుత్వాలు కూడా ఒకటో తేదీనే పలు ముఖ్యమైన కార్యక్రమాలను చేపడుతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెస్తాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల నవంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.ఇక నవంబర్ 1 నుంచి సామాన్యులపై గ్యాస్ బండ మోత కూడా మోగనుంది.
నవంబర్ 1 నుంచి మారనున్న రూల్స్..!
నూతన విద్యా విధానం – ఆంధ్రప్రదేశ్
బయోమెట్రిక్ అటెండెంస్ సిస్టం – ఆంధ్రప్రదేశ్
ఎల్పీజీ డెలివరీ సిస్టమ్
వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే నెల నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ కోసం వినియోగదారులు కచ్చితంగా వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అందించాల్సి ఉంటుంది.డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC)లో భాగంగా ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్లో ఈ మార్పు రానుంది.
డిపాజిట్లు, ఉపసంహరణలపై ఛార్జీలను సవరించనున్న పలు బ్యాంకులు
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిర్దేశిత పరిమితిని మించి డిపాజిట్, డబ్బును విత్డ్రా చేయడం కోసం నవంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఛార్జీలు సేవింగ్స్ ఖాతాదారులతో పాటు వేతన ఖాతాదారులకు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, యాక్సిస్ , సెంట్రల్ బ్యాంకులు డిపాజిట్లు, విత్డ్రా విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పెన్షనర్లకు ఎస్బీఐ ఊరట
పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకకు పింఛన్దారులు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండా వీడియో కాల్ సదుపాయాన్ని కల్పిస్తోంది. నవంబర్ 1 నుంచి ఈ సేవలకు ఎస్బీఐ శ్రీకారం చుడుతోంది. వృద్ధులకు నిజంగా పెద్ద ఊరటనే చెప్పాలి.
రైల్వే టైమ్ టేబుల్
దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే పలు రైళ్ల టైమ్ టేబుల్లో మార్పులు చేయబోతోంది. నవంబరు 1 నుంచి పలు రైళ్లకు కొత్త టైమ్టేబుల్ ప్రకటించనుంది. భారతీయ రైల్వేస్ ప్రకారం… 13 వేల ప్యాసింజర్ రైళ్లు , 7 వేల గూడ్స్ రైళ్లు టైమింగ్స్లో మార్పు రానున్నట్లు తెలుస్తోంది.
ఎల్పీజీ ధరలు
గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కారణంగా..చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగితే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు రానున్నాయి.
నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఎల్పీజీ (LPG) ధరలు ఈ మధ్య తోడయ్యాయి. ఎన్నడూ లేని రీతిలో సిలిండర్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండగా మారాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి 15 రోజులకోకసారి ఎల్పీజీ ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలో నవంబర్ ఒకటిన మరోసారి గ్యాస్ ధరను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నష్టాల నుంచి గట్టేందుకు ఏకంగా బండపై వంద రూపాయలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయని తెలిసింది. ఒకవేళ ప్రభుత్వం ఓకే అంటే గ్యాస్ బండ కోసం ఇకపై వెయ్యి రూపాయలకు పైగా సమర్పించుకోవాల్సిందే.
వాట్సాప్ బంద్
పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ తన సేవలు నిలిపివేస్తోంది. నవంబరు 1 నుంచి కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఓఎస్లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. దీనికి సంబంధించి ఫోన్ మోడల్స్లో జాబితాను వాట్సాప్ ఇప్పటికే విడుదలచేసింది. జాబితా కోసం క్లిక్ చేయండి..
ఐపీవోలు ఊరిస్తున్నాయ్…
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి శుభవార్త. నవంబర్ నెలలో పలు కంపెనీలు ఐపీవోకి రానున్నాయి. పాలసీ బజార్ ఐపీవో నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. పేటీఎం ఐపీవో సైతం నవంబర్ 8 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇవి కాకుండా నైకా, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్, సిగాచీ ఇండస్ట్రీస్ వంటివి కూడా ఐపీవోకు రానున్నాయి. మదుపు చేయాలనుకునే వారికి ఇదో అవకాశం.