Katti Mahesh: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మృతి చెందారు. అన్ని రకాల వైద్య సేవలు అందించిన్పటికీ, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. రెండు వారాల క్రితం (గత నెల 26న) నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరగడంతో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో అతడి తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే కత్తి మహేష్ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి కాస్త సీరియస్గా ఉండటంతో అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. డాక్టర్లు తల, కంటి భాగాల్లో గాయాలవడంతో శస్త్రచికిత్స కూడా చేశారు. కత్తి మహేష్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల వేసింది. అక్కడే రెండు వారాలుగా కత్తి మహేష్కు నిపుణుల డాక్టర్లు బృందం చికిత్స అందించినా.. అతడి ప్రాణాలు దక్కలేదు.
జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. అంతేకాకుండా తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను పలకరించేవారు. ఆయన నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించారు. హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలతో నటుడిగా అలరించాడు.