Coronavirus: మూడు పద్దతులతో కరోనాకు కళ్లెం వేయవచ్చని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. కొవిడ్-19 కట్టడి ప్రోటోకాల్, లాక్డౌన్, వ్యాక్సినేషన్ వల్ల ఏ కరోనా వేరియంట్నైనా సమర్థంగా నియంత్రించగలమని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా వేరియంట్ డెల్టా ప్లస్ అలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ డెల్టా ప్లస్.. దేశంలో ఇబ్బందులు సృష్టిస్తోందని చెప్పడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆత్మ స్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దని సూచించారు. ఎక్కడ కేసులు వెలుగులోకి వచ్చినా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అజాగ్రత్తగా మారిపోకూడదన్నారు. అలాగే మూడో వేవ్ రాకుండా అప్రమత్తంగా ఉంటూ కొవిడ్ ప్రోటోకాల్స్ను పాటించాలని సూచించారు. ఏ వేరియంట్ అయినా.. అడ్డుకునేందుకు.. సకాలంలో టీకాలు వేయడం, అవసరమైనప్పుడు లాక్ డౌన్ విధించడం, కోవిడ్ ప్రోటోకాల్ను కచ్చితంగా అమలు చేయడమే మార్గమని సూచించారు.
దేశవ్యాప్తంగా మూడో వేవ్ ముప్పు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్న ఈ తరుణంలో… గులేరియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెకండ్ వేవ్లో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొని భారత్ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయితే క్రమంగా పాఠశాలలు తెరవడంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించాలని గులేరియా సూచించారు. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి దశలవారీగా తరగతుల్ని ప్రారంభించాలన్నారు. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే భారత్లో ఇంకా వృద్ధులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తంచేవారు. కరోనా నిబంధనలు పాటిస్తున్నంత కాలం ఎటువంటి వేరియంట్ వచ్చినా సమాజంపై ప్రభావం తక్కువగానే ఉంటుదని రణదీప్ గులేరియా పేర్కొన్నారు.