CBSE Exams: కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే రెండు అకాడమిక్ ఇయర్స్ రద్దయ్యాయి. బహుశా చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలు రద్దు కాగా మరికొన్ని వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో సీబీఎస్ఈ 12వ తరగతితోపాటు పలు పోటీ పరీక్షలు సైతం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను నిర్వహించాలా వద్ద అన్న దానిపై మరికాసేపట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యాశాఖ మంత్రులతో పాటు రాష్ట్రాలకు చెందిన ఎగ్జామినేషన్ బోర్డు సభ్యులు పాల్గొంటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్తో పాటు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షతో పాటు, ఇతర పోటీ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా 12వ తరగతి పరీక్షల నిర్వహణ ఇతర పరీక్షలపై ప్రభావం చూపుతుండడంతో పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఓ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మంత్రి రమేశ్ పొక్రియాల్ ట్విట్టర్ వేదికగా పలువురి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. పరీక్షల నిర్వహణపై ఈరోజు సాయంత్రంలోపు ఏదో ఒక నిర్ణయం వెలువడనుంది.